యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కన్నడ రాజకీయాలపై అమిత్ షా తొలిసారి స్పందించారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని అపవిత్ర కూటమిగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అభివర్ణించారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హద్దులు దాటి ప్రవర్తించిందని, తమ పార్టీపై అసత్య ప్రచారాలు చేసిందని విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ముందు 122 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ సీట్లు 78కి పడిపోయాయని, మరోవైపు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. జేడీఎస్కి కూడా కేవలం 37 సీట్లే వచ్చాయని, తక్కువ సీట్లు వచ్చినందుకే ఆయా పార్టీలు వేడుకలు చేసుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. ప్రజా తీర్పుకు భిన్నంగా కాంగ్రెస్-జేడీఎస్ అపవిత్ర కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోందని అన్నారు.
కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో గెలిచిన జేడీఎస్.. తిరిగి అదే కాంగ్రెస్తో పొత్తుపెట్టుకోవడం ముమ్మాటికీ అపవిత్రచర్యేనన్నారు. అధికారం కోసం విలువలు, సిద్ధాంతాలు వదిలేసిన ఆ రెండు పార్టీలను కన్నడజనం అసహ్యించుకుంటున్నారు. యడ్యూరప్ప బలనిరూపణ కోసం ఏడు రోజులు గడువు అడిగారని, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నారని తీర్పును ప్రభావితం చేసేలా వాళ్లు కోర్టుకు అబద్ధాలు చెప్పారు’’ అని అమిత్ షా అన్నారు.