దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక రాజకీయ భవితవ్యం రేపు తేలిపోనుంది. స్పష్టమైన మెజారిటీ లేకున్నా భాజాపా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్పకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీంతో భాజాపా అంతర్మథనంలో పడింది.
విశ్వాస పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని బీజేపీ తరపు న్యాయవాది రోహత్గీ సుప్రీం ధర్మాసనాన్ని కోరినప్పటికీ… ఆయన కోరికను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రేపు బలపరీక్షను ఎదుర్కోవడానికి మీకున్న అభ్యంతరాలు ఏమిటని ఈ సందర్భంగా రోహత్గీని ధర్మాసనం ప్రశ్నించింది. బలపరీక్షను రేపు ఎదుర్కోవాల్సిందేని ఆదేశించింది.
ప్రభుత్వ ఏర్పాటును గురించి గవర్నర్కు ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాసిన లేఖలను ధర్మాసనం పరిశీలించింది. ఎంతమంది మద్దతు ఉందో వారి వివరాలను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. పూర్తిగా నంబర్ గేమ్పై కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉందని వ్యాఖ్యానించింది. శనివారం బలపరీక్ష నిర్వహిస్తే చేస్తే బావుంటుందని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కాంగ్రెస్ తరఫు న్యాయవాది సింఘ్వీ సంసిద్ధత వ్యక్తం చేయగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు.
రోహత్గి అభ్యర్థనపై అంత సమయం ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దారి తీసే అవకాశం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనివల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగాలని తీర్పు నిచ్చింది.