ప్రస్తుతం నగరాలు కాంక్రిట్ జంగిల్గా మారిపోయి తరుణంలో అవాసాలు కరువయి వణ్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన్ని చోట్లు మనుషులపై దాడులు చేసిన సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు.
వివరాల్లోకి వెల్తే…మండి జిల్లా తుంగ్ ప్రాంతంలో దారి తప్పి ఊర్లోకి వచ్చిన ఓ చిరుతపులి పిల్ల చలికి తట్టుకోలేకపోయింది. అటూ ఇటూ చూసి ఎదురుగా కనిపించిన ఏటీఎం సెంటర్లోకి దూరింది. అక్కడ వేడిగా ఉండటంతో అక్కడే ఉండిపోయింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పులి పిల్లను చూసి భయంతో బయటకు పరుగులు తీశాడు. గట్టిగా అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. ఏటీఎంలో దూరిన పులిపిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
చివరికి ఓ టాక్సీ డ్రైవర్ సాహసం చేసి ఏటీఎం నుంచి దానిని బయటకు తీశాడు. అతడి చేతుల నుంచి తప్పించుకున్న పులి పిల్ల అక్కడే ఉన్న ఓ వాహనం కిందికి వెళ్లి నక్కింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు పులిపిల్లను పట్టుకొని అడవిలో వదిలేశారు.