భారతదేశంలో ధనవంతులకు కొదవ లేదు. పేదలకు నిలువ నీడ లేదు అనే చందంగా పరిస్థితి ఉంది. పేదలు మరింత పేదలుగా మారుతుండగా ధనవంతులు అత్యంత ధనవంతులుగా మారుతున్నారు. ఈ ధనవంతుల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఏ జాబితా విడుదల చేసినా.. ఏ సర్వే చేపట్టినా భారత స్థానం తప్పక ఉంటుంది. ఇప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో కూడా భారతదేశ సంపన్నులు టాప్లో నిలిచారు.
రిలయన్స్ పరిశ్రమల అధినేత ముఖేశ్ అంబానీ ఏకంగా ఆసియాలో మూడో స్థానంలో నిలిచారు. ఇక బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ టాప్ 100 జాబితాలో ఆయన 19వ స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద సుమారు 38.3బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ జాబితా (టాప్ 100 వరకు)లో అంబానీతో పాటు మరో నలుగురికి స్థానం దక్కింది.
లక్ష్మీ మిట్టల్(51వ స్థానం), పల్లోంజీ మిస్త్రీ (61వ స్థానం), విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ (66వ స్థానం), హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్ (85వ స్థానం)ల్లో ఉన్నారు. నిన్న విడుదల చేసిన బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ టాప్ 500 జాబితాలో మొత్తం 24 మంది భారతీయులకు చోటు దక్కించుకున్నారంటే మన దేశంలో సంపద అంతా ఎక్కడ ఉందో అర్థమవుతూనే ఉంది.
కుబేరుల జాబితాలో అమెజాన్ సీఈఓ జెఫ్ బిజోస్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద ఈ ఏడాది 21.8బిలియన్ డాలర్లు పెరిగింది. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఉన్నారు. ఆయన సంపద ఈ ఏడాది 1.36బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ జాబితాలో ఇద్దరు యూరోపియన్లకు మాత్రమే స్థానం లభించింది. 47.2బిలియన్ డాలర్ల సంపదతో ఇక అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ 13వ స్థానంలో ఉన్నారు.