అనాథలు అంటే అందరికీ చులకన భావం ఉంటుంది. వారిని ఆదరించే వారు అనాథలయ్యారు.. కానీ వారిలో ఎంతో ప్రతిభ, శక్తులు దాగి ఉంటాయి. అలాంటి వారికి ప్రోత్సాహం.. అవకాశం ఇస్తే మాత్రం అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. అలాంటి వారికి కొంత ప్రోత్సాహం.. సహకారం అందిస్తే అత్యున్నత స్థానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ఆదర్శ నిర్ణయం తీసుకుంది. అనాథలకు అండగా నిలిచే ఆ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
విద్య, ఉద్యోగాల్లో అనాథలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అనాథలకు 1 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయం.
ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం, ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్మెంట్లలోనూ అనాథలకు ప్రాధ్యాన్యం ఇస్తామని ప్రకటించారు. తల్లిదండ్రులు లేని అనాథలకు ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్ పొందాలని సర్కారు కోరింది. అనాథలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించడంతో వారికి న్యాయం చేస్తున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ నిర్ణయంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనాథలను అక్కున చేర్చుకుంది.