కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా ఒంటరైనా అనేక దేశాధినేతల నుంచి విమర్శలు వస్తున్నా పాక్ కు బుద్ది రావడంలేదు. ఉగ్రవాదుల ద్వారా ఏచిన్ని అవకాశాన్ని వదలకుండా కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పాక్ చేస్తున్న కుట్రలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఘాటుగా స్పందించారు. జమ్మూకశ్మీర్ లోయలో అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్కు ఉన్న ఏకైక మార్గం ఉగ్రవాదమన్నారు.
పాక్ ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ ప్రజలను కాపాడాడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కశ్మీర్లో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం దేశంలో చొరబడడానికి 230 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం కోడ్ భాష ఉపయోగిస్తోందని, తాము ఆ సంకేతాలను గుర్తించామని తెలిపారు.ఆపిల్ ట్రక్కులు ఆటంకాలు లేకుండా ఎలా ముందుకెళుతున్నాయి? వాటిని మీరు అడ్డుకోలేరా? లేకపోతే గాజులు పంపమంటారా? అంటూ పాకిస్థాన్ నుంచి కశ్మీర్ కు రహస్య సంకేతాలతో కూడిన సంభాషణలు నడుస్తున్నాయని వెల్లడించారు.
సరిహద్దు పొడవునా 20 కిమీ పరిధిలో పాకిస్థాన్ కు చెందిన సిగ్నల్ టవర్లు ఉన్నాయని, వాటిద్వారా కశ్మీర్ లోని తమ వారికి సందేశాలు పంపుతున్నట్టు అర్థమవుతోందని అన్నారు. ఆయుధాలు, ఇతర సరంజామా పంపాలని ఉగ్రవాదులు కోరుతున్నట్టుగా భావిస్తున్నామని దోవల్ వివరించారు