పుల్వామా ఉగ్రదాడి ప్రతీ కారంగా ఐఏఎఫ్ పాక్ అక్రమితి కాశ్మీర్లోని బాలాకోట్లో ఉన్న జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతిగా పాక్ యుద్ధవిమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపనులను ప్రయోగించారు. అయితే ఈ దాడిలో అత్యాధునిక ఎఫ్-16 యుద్ద విమానాలను దాయాది దేశం వినియోగించింది.ఇప్పుడు ఇదే పాకిస్థాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది.
భారత్లోకి చొచ్చుకొచ్చిన ఎఫ్ -16 యుద్ధవిమానాన్ని భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ నేల కూల్చాడు. భారత్పై దాడి చేసేందుకు వచ్చిన పాక్ ఎఫ్-16లను భారత మిగ్ విమానాలు అడ్డుకోవడంతో అవి వెనుదిరిగాయి. అయితే కొన్ని క్షిపణులును పాక్ ప్రయోగించింది. కేవలం ఎఫ్-16 విమానాలు మాత్రమే ప్రయోగించగల ఆమ్రామ్ క్షిపణి శకలాలను రాజౌరి ప్రాంతంలో పడిపోగా వాటిని సేకరించిన భారత్ మీడియా ముందు ప్రదర్శించడంతో పాక్ దమననీతి బయటపడింది. దాడికి ఎలాంటి ఎఫ్-16 యుద్ధవిమానాలను ఉపయోగించలేదని బుకాయించిన పాక్ ఇబ్బుందుల్లో పడింది.
భారత్ పై దాడికి ఎఫ్-16 యుద్ధ విమానాలను ఎందుకు వాడారో చెప్పాలని అగ్రరాజ్యం అమెరికా తాజాగా పాకిస్థాన్ ను డిమాండ్ చేసింది. ఉగ్రవాదుల ఏరివేతతో పాటు ఆత్మరక్షణకు మాత్రమే ఎఫ్-16లను వాడుతామని హామీ ఇచ్చిన పాకిస్థాన్ వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేసింది. అయితే తాజాగా కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ స్థావరాలపై దాడికి ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ వాడింది. ఒప్పందానికి విరుద్ధంగా విమానాలను పాక్ ఉపయోగించడంపై మొత్తం సమాచారాన్ని ఇవ్వాలని పాక్కు సూచించినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
గతంలో ఎఫ్-16ల అమ్మకాల విషయంలో అమెరికా చట్టసభ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే పాక్ పాక్ అనుకూల లాబీయిస్టులు ఈ విమానాలను కేవలం ఉగ్రస్థావరాలపై మాత్రమే ప్రయోగిస్తామని హామీ ఇచ్చి వీటిని కొనుగోలు చేసింది.