పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ ‘జనసేన’కు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో ‘జనసేన’కు రాజకీయ పార్టీగా గుర్తింపు లభించగా, తాజాగా నవ్యాంధ్రప్రదేశ్ లోనూ ‘జనసేన’కు ‘పొలిటికల్ పార్టీ’ హోదా దక్కింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం… ‘జనసేన’ను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.
పార్టీ అధినేత హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ కు పార్టీ గుర్తింపునకు సంబంధించిన పత్రాలు చేరాయి. పవన్ కల్యాణ్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఈ పత్రాలను పంపింది. ఇకపై ‘జనసేన’ను రాజకీయ పార్టీగా గుర్తించాలని సదరు పత్రాల్లో ఎన్నికల సంఘం సూచించింది. అయితే రాజకీయ హోదా దక్కినప్పటికీ, పార్టీకి గుర్తును మాత్రం ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు. అయితే గుర్తు కేటాయింపులో స్వతంత్ర అభ్యర్థుల కంటే
‘జనసేన’కు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చింది. జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించాలని 2014లో పవన్ కల్యాణ్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సుదీర్ఘ సమయాన్నే తీసుకున్న సంఘం ఎట్టకేలకు పవన్ ప్రతిపాదనను ఆమోదించింది. జనసేన గుర్తింపునకు సంబంధించి కృష్ణ అనే వ్యక్తి వెలిబుచ్చిన అభ్యంతరాలను కొట్టేసిన సంఘం… పవన్ పార్టీకి రాజకీయ గుర్తింపునిచ్చింది. ఈ సమాచారంతో పవర్ స్టార్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఓ పక్కన పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేసిన పిదప, పార్టీకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా శరవేగంగా పూర్తి కావడం విశేషం.