కరోనా కోసం ఓ ఆయుర్వేద మందును తయారుచేసి ఆనందయ్య పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఏపీ ప్రభుత్వం కూడా బాగానే సహకరించింది. మరోవైపు మందు పంపిణీ విషయంలో కోర్టు కూడా జోక్యం చేసుకున్నది. మొత్తానికి కంట్లో వేసే చుక్కల మందు మినహా.. మిగిలిన అన్ని మందులకు అనుమతులు వచ్చాయి. అయితే వలంటీర్ల సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందును పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ ప్రస్తుతం ఎందుకో ఈ మందు విషయంలో ప్రభుత్వం పెద్దగా చొరవ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఆనందయ్య సొంత నియోజకవర్గమైన సర్వేపల్లిలో మందు పంపిణీ చేశారు. మరోవైపు చంద్రగిరి నియోజవర్గంలో అక్కడి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మందును పంపిణీ చేశారు.
అయితే ఇవాళ ఆనందయ్య మీడియాతో మాట్లాడుతూ.. కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ నేను మందు అందరికీ పంపిణీ చేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం కేవలం దాతల సాయంతోనే పంపిణీ చేస్తున్నాను. మందు పంపిణీకి సాయం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాను. కానీ పెద్దగా స్పందన లేదు. కొన్ని చోట్ల రాజకీయనాయకుల చొరవతో మందును పంపిణీ చేస్తున్నాము. రాజకీయాలకతీతంగా అందరికీ మందు పంపిణీ చేయాలన్నదే నా అభిమతం. మందుకు సంబంధించిన ముడి సరుకుల కొరత ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ముడిసరుకు పంపిణీ చేస్తే బాగుంటుంది’ అంటూ ఆనందయ్య పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గిపోతుందడడంతో ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించడం లేదన్న వాదనలు వస్తున్నాయి. మరోవైపు ఈ మందు పేరిట ఆయుర్వేద దుకాణాల్లో, కొన్ని చోట్ల కిరాణా దుకాణాల్లోనూ అందుబాటులో ఉండటంతో దీనిపై విమర్శలు వస్తున్నాయి.
Also Read