పార్టీలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో జగన్ మరో సారి ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అలక బూనారు. త్వరలో పార్టీని వీడుతున్నారనె వార్తలు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేశాయి.
ఆయన ఎవరో కాదు , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి . ఒంగోలు టికెట్ దక్కకపోవడం, తన రాజకీయ శత్రువు, బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అలకపాన్పు ఎక్కిన వైవి అలకవీడారు. ఎన్నికల ముందు నుంచి అలక పాన్పు ఎక్కిన ఆయన పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా పార్టీ కార్యకలాపాల్లో కానీ అంతగా పాల్గొనలేదు.
వైవి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటె పార్టీకి నష్టం తప్పదన్న నేపధ్యంలో ఆయన అలక వీడేలా జగన్ పై ఒత్తిడి పెంచారట పార్టీ కీలక నేతలు. టికెట్ ఇవ్వకపోయినా నామినేటెడ్ పదవుల్లో కీలక పదవి ఇవ్వాలని, వైవీని దూరం చేసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని పలువురు జగన్ కు సూచించారట. దీంతో రంగంలోకి దిగిన జగన్ పార్టీ అధికారంలోకి వస్తే వైవీ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి చెవిలో వేశారట వైసీపీ నేతలు. దీంతో దిగొచ్చిన బాబాయ్ బుధవారం నుంచి పార్టీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ అయ్యారట.