ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ప్రస్తుతం స్తబ్ధుగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇంత స్తబ్ధుగా ఉండడం గతంలో ఎన్నడూ లేదు. ఎవరికి వారు ఎవరి పనిని వాళ్లు చక్కబెట్టుకుంటున్నారే తప్ప.. పోటాపోటీగా బరిలోనికి దిగి ఓటర్లను ఆకట్టే ప్రయత్నం చేస్తున్నది లేదు. పక్కనే ఉన్న తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ కథన రంగంలోనికి దిగి.. ఎన్నికల లక్ష్యంగానే గత రెండు నెలల నుంచి హడావుడి పెంచగా.. తాజాగా కేసీఆర్ కూడా సై అంటే సై అంటూ బరిలోనికి దిగారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కుల సంఘాల వరకూ అందరికీ తాయిలాలను అందించే పనిని చేపడుతున్నారు. ఇప్పటివరకూ పెండింగ్లో ఉంచిన సమస్యలన్నింటికీ రాత్రికి రాత్రి పరిష్కారాలు చూపేస్తూ.. ఉద్యోగులకు జీతాల పెంపు నుంచి.. కుల సంఘాల భవనాలకు స్థలాల కేటాయింపు వరకూ అన్నింటినీ చకచకా చేసుకెళ్లిపోతున్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే.. పచ్చదనాల తెలంగాణను ఆవిష్రృతం చేస్తానని.. ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు డిసెంబర్లోనే ఉండొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ ఫోకస్ను పెట్టాయి. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రను పక్కన బెట్టి.. తెలంగాణ ప్రణాళికల్లో హైదరాబాద్ కేంద్రంగా మునిగి తేలుతున్నారు. తాజాగా జనసేన, వామపక్ష పార్టీల ఉమ్మడి కార్యాచరణతో బరిలోనికి తెలంగాణలో దిగాలని చర్చలు కూడా మొదలెట్టాయి.
ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. తెలుగుదేశం పార్టీ పాలనా కార్యక్రమాల్లో మునిగితేలుతోంది. చంద్రబాబు ఎప్పటిలానే.. తన పాలన, అభివృద్ధి, రాజధాని నిర్మాణాలపైనే అత్యధిక దృష్టి పెట్టి.. బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే.. అంతర్గతంగా శ్రేణులతో టచ్లో ఉంటున్నప్పటికీ ప్రత్యక్షంగా ప్రజల్లోనికి మాత్రం ఎన్నికల లక్ష్యంగా ఇంకా వచ్చింది లేదు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తూ వెళుతున్నారు. జగన్ ఎన్నికల లక్ష్యంగానే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ.. అదో ప్రహసనంగా మారిపోయిందనే విమర్శలే ఎక్కువ వస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా.. తెలుగుదేశం పార్టీ డబ్బులు పంచుతుంది.. రూ.3 వేలు అడిగితే.. రూ.5 వేలు అడగండి.. ఓట్లు మాత్రం ఎవరికి వేయాలో ఆలోచించుకోండి అంటూ పాడిందే పాడుతూ వెళుతున్నారు. పర్యటనలో అధికశాతం జగన్ స్పీచ్లనూ ఒకే మాదిరిగా.. ప్రారంభంలో ఏం చెప్పాడో.. అదే చెబుతూ వెళ్లడం కూడా వినీవినీ జనాలకు విసుగొచ్చే పరిస్థతి వచ్చేసింది. ఇంక పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను మూన్నాళ్ల ముచ్చటగానే రెండు జిల్లాల్లో చేపట్టి ఆపేసి.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసం కసరత్తు చేసుకుంటున్నాడు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఇంకా రాజుకోలేదు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం ఉద్ధృతం లాంటివి తెలంగాణలో ఇప్పటికే మొదలైపోగా.. ఆంధ్రప్రదేశ్లో ఆఊసే లేదు. 2019 మార్చి తర్వా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. ఈ ఏడాది చివరి నుంచి మొదలెట్టొచ్చనే ధోరణిలో ఈ మూడు ప్రధాన పార్టీలూ ఉన్నాయి. తెలంగాణలో మరో మూడు నెలల్లో ముందస్తుకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నందున.. వేడి రాజుకుంది.