దరిశిలో వైసీపీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు ఏకపక్షంగా జరగనున్నట్టు అర్థమవుతోంది. ఓటర్ల నాడి ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా బరిలోనికి దిగిన.. మద్దిశెట్టి వేణుగోపాల్కు ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బ్రహ్మరథం పడుతుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దరిశిలో అధికార తెలుగుదేశం పార్టీలో లుకులుకలు ఇప్పటికే బయటపడుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో వైకాపాలో చేరిపోయారు. ఇంకా ఎన్నికల్లోగా మరింత మంది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సౌమ్యుడు, ఉన్నత విద్యావంతుడు, సామాజిక సేవలో ముందునుంచి ఉన్న వ్యక్తిగా.. మద్దిశెట్టి వేణుగోపాల్పై స్థానికంగా ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ఇదే.. ఈయనకు ఇప్పుడు కొండంత బలంగా మారింది. మరోవైపు మద్దిశెట్టి విస్రృతంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను స్వయంగా కలుస్తున్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళుతున్నారు. నియోజకవర్గంలోని పోతవరం, శేషంవారిపాలెంట, దేవవరం సహా అన్ని గ్రామాల్లోనూ.. మద్దిశెట్టికి పూల వర్షం కురిపిస్తున్నారు. భారీ గజమాలలను తీసుకొచ్చి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. గెలుపు విషయం తాము ఆలోచించడం లేదని.. అది ఎప్పుడో ఖాయమైపోయిందని.. కేవలం మెజార్టీ ఎంత వస్తుందనే దానిపైనే దృష్టిసారించామని.. మద్దిశెట్టి వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
దరిశిలో తన విజయం ఖాయమైపోయినప్పటికీ.. మద్దిశెట్టి వేణుగోపాల్ ఏమాత్రం ఎదుటి పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా.. అన్ని రకాలుగానూ ప్రచారం ఉద్ధృతంగా చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను దరిశిలో ఇంటింటికీ తీసుకెళుతున్నారు. వైఎస్ ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పూర్తిస్థాయి మద్దతును ఇప్పటికే మద్దిశెట్టికి ఇస్తున్నారు. వైఎస్ జగన్ నవరత్నాల పథకం గురించి ప్రజల్లోనికి లోతుగా తీసుకెళుతుండడంతో.. టీడీపీకి చెందిన నాయకులు సైతం ఆకర్షితులవుతున్నారు. తాజాగా టీడీపికి చెందిన మాజీ సర్పంచ్ శంఖం హనుమంతరావు ఆధ్వర్యంలో 500 మందికి పైగా నాయకులు మద్దిశెట్టి సమక్షంలో వైఎస్ ఆర్సీపీలో చేరారు. వైఎస్ ఆర్సీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని మద్దిశెట్టి వర్గీయులు వెల్లడించారు. ప్రచారాన్ని మరింత ఉద్ధృతంగా చేస్తున్నారు. ఎదుటివారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. దూసుకెళుతున్నారు. మద్దిశెట్టితో పాటూ ఆయన తరఫున మండలంలోని అన్ని గ్రామాల్లోనూ.. వైఎస్ ఆర్సీపీ కార్యకర్తలు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
! మహిళలు, యువత మద్దతు..
మద్దిశెట్టికి ప్రధానంగా మహిళలు, యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినప్పుడు కూడా.. మహిళలు, యువతే మద్దిశెట్టికి తమ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల సంఖ్య దరిశిలో 2,14,233 మంది ఉన్నారు. వీరిలో మహిళల ఓట్లే.. 1,06,314 ఉన్నాయి. ఈసారి వీరితో పాటూ అన్ని వర్గాల నుంచి మద్దిశెట్టికి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది. అందుకే గెలుపు నల్లేరుపై నడకలా మారిపోయింది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలో.. అంతా చేస్తున్నా.. వారికి ఓటర్ల నాడి, మద్దిశెట్టి విజయాన్ని ఎలా అడ్డుకోవాలో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. దరిశిలో అఖండ మెజార్టీతో గెలిచి.. తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామంటూ.. మద్దిశెట్టి వర్గీయులు పేర్కొంటున్నారు. మద్దిశెట్టిని గెలిపించుకుంటే.. దరిశిలో స్తంభించిపోయిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించి.. అగ్రపథంలోనికి తీసుకెళ్తారనే నమ్మకం ఓటర్లలో ఉంది. అందుకే.. ఎక్కడికి వెళ్లినా.. పూల వర్షం కురిపిస్తూ.. హారతులు ఇస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.