తెలంగాణా ఎన్నికల ప్రాచారంలోకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగారు. కొడంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షలు దాటిందని… కానీ, కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ. 60 వేల అప్పు మిగిలిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏర్పాటు చేసిందని… కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజల ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో ప్రజల ఆదాయం పెరగలేదని…కానీ కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని వ్యాఖ్యానించారు.
ప్పుడు వీస్తున్న గాలి కాంగ్రెస్ గాలి అని… కేసీఆర్ ను ఓడించే గాలి అని చెప్పారు. లక్ష ఉద్యోగాలు ఇస్తాని చెప్పిన కేసీఆర్… నాలుగున్నరేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, రైతులు, యువతను మోసం చేశారని మండిపడ్డారు. 22 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తామని వంచించారని అన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ బగీరథ పథకాల్లో అంతులేని అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని అధికారం మొత్తం ఇప్పుడు ఒక కుటుంబం చేతిలో ఉందని… మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అందరికీ పంచుతామని చెప్పారు.
తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు రాలేదని ఆరోపించిన రాహుల్ గాంధీ… కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయాన్ని కేసీఆర్ తమ కుటుంబసభ్యులు, మిత్రులు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీపైకూడా విమర్శలు గుప్పించారు. మోదీ దేశాన్ని విభజించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో అవసరం ఉన్నప్పుడల్లా కేసీఆర్ మోదీకి సహాయపడ్డారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగూణంగానే తాము బీజేపీ బిల్లులకు మద్దతు ఇస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీలు తనతో చెప్పారని రాహుల్ ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని… దాని పేరు తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఎద్దేవా చేశారు.