ఇద్దరు చంద్రుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.ఒకరిమీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలు బాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
గతంలో తాను ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్నప్పుడు కేసీఆర్ కూడా తనతోనే ఉన్నారని, ఆ తర్వాతనే ఆయన మంత్రి అయ్యారని బాబు ఎద్దేవ చేశారు. వైస్రాయ్ హోటల్ సిద్ధాంతకర్త ఆయనే కదా.. నడిపించిందే ఆయన.. ఆ విషయాలు ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు చంద్రబాబు.
హరికృష్ణ మృతిపై తాను రాజకీయాలు చేశానని ఆరోపించడంలో అర్ధం లేదని అన్నారు. కేసీఆర్కు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీ కాదా? ఆయన ఎక్కడ నుంచి ఊడిపడ్డాడు? తన హయాంలో మంత్రిగా పనిచేయలేదా? అప్పట్లో జన్మభూమి కార్యక్రమాలపై ఊరూరా తిరిగి ప్రచారం చేసింది మీరు కాదా? మరి ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
కేంద్రం నమ్మించి మోసం చేయడం వల్లే బయటకు వచ్చామన్నారు. అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చినట్లే ఏపీకీ కూడా ఇచ్చారన్నారు. విభజన జరిగిన తర్వాత ఏపీకి రూ.500 కోట్లు సాయం చేస్తానన్న కేసీఆర్కు కేంద్రం ఇప్పుడిచ్చిన రూ.750 కోట్లు ఎక్కువైపోయాయా? అని నిలదీశారు. లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామంటున్నారు.. పనులెక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు.
ఏపీలో వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని చంద్రబాబునాయుడు కోరారు. తనను ఓడించడానికి వైసీపీ, మోదీలతో కేసీఆర్ చేతులు కలిపి ప్రచారం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీని మోయలానుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదని, నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.