ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆ పార్టీ నాయకులు బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్నారు. రాష్ర్ట విభజనను అడ్డదిడ్డంగా చేశారనే కసి, కోపంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆంధ్రులు పాతరేశారు. అదే అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మోడీ.. ఆంధ్రాను వాళ్లు విడగొడితే నేను ఆదుకుంటా.. అంటూ కలరింగ్ ఇచ్చి లబ్ధి పొందాడు. కానీ.. తర్వాత ఆంధ్రాను ఆదుకోవడం మాట అటుంచి.. నట్టేట ముంచారు. దీంతో రెండు జాతీయ పార్టీలూ దొందూ దొందే అన్న చందంగా ఆంధ్రుల గుండెల్లో మంట మరింత పెరిగింది. మోడీ కంటే.. కాంగ్రెస్సోల్లే నయమనే పరిస్థతి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది.
ఈ నేపథ్యంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ ఆంధ్రాలో మళ్లీ పుంజుకోవాలంటే ఏదో ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే సరిపోతుందని ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తాజాగా మళ్లీ సొంత పార్టీలోనికి వచ్చిన కిరణ్కుమార్రెడ్డి తదితరులు ప్రణాళికా రచన చేశారు. దీనిలో భాగంగానే రాహుల్ గాంధీని రాష్ర్టానికి తీసుకొచ్చి.. రాష్ర్ట విభజన విషయంలో తప్పు జరిగిందని, క్షమించమని బహిరంగంగా చెప్పిస్తే.. ప్రజల్లో ఉన్న కోపం పూర్తిగా పోతుందనేది కాంగ్రెస్ సీనియర్ల నమ్మకం. తిరుపతి, విశాఖ, విజయవాడ మూడు ప్రాంతాల్లో ఏదోఒక చోట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాహుల్తో ప్రకటన చేయించాలని భావిస్తున్నట్టు ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వెళ్లడించారు.
రాహుల్ గాంధీ వచ్చి విభజన తప్పయిందని ఆంధ్రలో ప్రకటిస్తే.. పక్కనున్న తెలంగాణలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే అత్యంత సున్నితంగా ఈ విషయాన్ని డీల్ చేయాలని భావిస్తున్నారు. అసలు రాష్ర్ట విభజనే తప్పని కాకుండా, అశాస్ర్తీయంగా జరిగిందంటూ.. క్షమించమని అడిగితే అక్కడా, ఇక్కడ ఢోకా ఉండదని కాంగ్రెస్ అధిష్ఠానం సైతం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రకటన చేసిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం మొత్తం తాము అధికారంలోనికి వచ్చిన వెంటనే పూడ్చేశ్తామంటూ రాహుల్ నోటి వెంట చెప్పించనున్నారు. ఈ మేరకు టి.కాంగ్రెస్ నేతల అభిప్రాయం కూడా తీసుకుని.. తెలంగాణలో పార్టీకి నష్టం లేకుండా ఉండేందుకు వారి సలహాలు సైతం తీసుకోనున్నారు.
విభజనే తప్పంటూ ఆంధ్రలో నోరు జారితే.. పక్కనే అవకాశం కోసం కాచుకుని కూర్చున్న కేసీఆర్ దానిని రచ్చరచ్చ చేసి మళ్లీ తెలంగాణ వాసుల్లో సెంటిమెంట్ను రగిలించగల సమర్థుడు. అందుకే.. కేసీఆర్కు ఆ అవకాశం ఇవ్వకుండా.. చాలా నేర్పుగా అక్కడా ఇక్కడా ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనేది కాంగ్రెస్ ప్రణాళిక. తెలంగాణలో కంటే ఆంధ్రాలో కాంగ్రెస్కు అభిమానులు, బలమైన ఓటింగ్ ఉన్నాయి. ఆంధ్రులకు తగిలిన గాయానికి మందు పూస్తే.. కాంగ్రెస్ పుంజుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయిన సీనియర్లందరినీ.. మళ్లీ వెనక్కు రప్పించే ప్రయత్నాలను అధిష్ఠానం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్తో ప్రకటన చేయిస్తే రాష్ట్రంలో పార్టీ మొత్తం మళ్లీ గాడిలో పడుతుందని ఏపీ కాంగ్రెస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.