పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. పార్లమెంట్ హాలు దద్దరిల్లేలా ఆందోళన చేయాలని టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలకు ప్రగతి భవన్లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఏడున్నరేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. విభజన చట్టంలోని ఏ హామీని కూడా అమలు చేయడం లేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించమని కోరుతున్నాపట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని తెలంగాణలోని ప్రాజెక్టులను విస్మరించారని, నిధుల పంపిణీలోని అసమానతలు దేశం మొత్తానికి తెలిసేలా ఆందోళన చేయాలని ఎంపీలకు సూచించారు.
రాష్ట్రంలోని గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా ఇప్పటి వరకు స్పందన లేదని చెప్పారు. యాసంగి పంట కొనుగోలు విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత లేదని అన్నారు. ఐపీఎస్. ఐఏఎస్ అధికారుల అధికారాల విషయంలో నిబంధనలు మార్చి రాష్ట్రాల అధికారాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వీటన్నింటిపై జాతీయ దృష్టిని ఆకర్షించేలా పోరాడాలని మార్గ నిర్దేశం చేశారు.