చంద్రబాబునాయుడుకు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సవాలు విసిరారు. గడిచిన నాలుగేళ్లలో చేసిన రూ. 1.30 లక్షల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖర్చు చేశారో చెప్పగలరా ? అంటూ సవాలు విసిరారు. చంద్రబాబు నిజాలు చెప్పి పరిపాలన చేయగలరా అంటూ సవాలు విసరటం విచిత్రంగానే ఉంది
ప్రభుత్వం వేరు వ్యాపారం వేరంటూనే చంద్రబాబు మాత్రం ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారని విమర్శలు చేశారు.చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జర్లాండ్ ఆర్థికవేత్త వ్యతిరేకించారని తెలిపారు. వారానికోసారి ఖర్చు పెట్టిన లెక్కలు ప్రజలకు చెప్పగలరా అని, కనీసం ఈ 9 నెలల ఖర్చైనా చెప్పాలన్నారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సి వస్తోందని బాబు చెప్పారని, నంద్యాల ఎన్నికల్లో ఒప్పుకున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సొస్తోందన్న విషయాన్ని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబే ఒప్పుకున్నట్లు ఉండవల్లి చెప్పారు.
రాజకీయాలు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే ఉండవల్లి మద్యంపై మాట్లాడారు. రూ. 8.50కి తయారయ్యే మద్యాన్ని ప్రభుత్వం రూ. 50కి అమ్ముకుంటు 37 రూపాయల లాభం సంపాదిస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనను సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు.
అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా జారీ చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. అమరావతి బాండ్లు కొన్న తొమ్మిది మంది పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.అమరావతిని అభివృద్ది చేసే పేరుతో అధిక వడ్డీకి నిధులు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
బాండ్ల ద్వారా 2 వేల కోట్ల రూపాయాలను సమీకరిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. రెండు వేల కోట్లకు ప్రతి మూడు మాసాలకు ఓసారి 10.36 శాతం వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి బాండ్ల సేకరణ విషయమై బ్రోకర్ కు రూ. 17 కోట్లు ఇవ్వడమే బాబు మార్క్ పారదర్శకతా అని ఆయన ప్రశ్నించారు.