తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యూహం బెడిసికొట్టింది. కేంద్రంపై యుద్దం చేయాలి అనుకున్న ఆయన నోరు జారడంతో అనేక రాజకీయ పక్షాలు ఇప్పుడు కేసీఆర్ పై యుద్దం ప్రకటించాయి. ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో టీఆర్ ఎస్ ఆత్మరక్షణలో పడింది.
ఇటీవల కొంత కాలంగా కేసీఆర్, తెలంగాణ మంత్రులు కేంద్ర వైఖరిపై తీవ్రంగా మండి పడుతున్నారు. ధాన్యం కొనుగోలు అంశం, విభజన హామీల అమలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అధికాలను కేంద్ర తన పరిధిలోకి తీసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నారు.
ఈక్రమంలో కేసీఆర్ కేంద్రంపై యుద్దం ప్రకటించారు. ఈక్రమంలో అన్ని జాతీయ స్థాయి రాజకీయ పార్టీలను సైతం కలుపుకొని వెళ్లాలని నిర్ణయించారు. కానీ కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లపై పరుషమైన భాషను వాడారు. అంతటితో ఆగకుండా భారత రాజ్యాంగాన్నే మార్చాలని అన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు కేసీఆర్ పై యుద్ధం ప్రకటించాయి. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు తల పట్టుకున్నాయి.