ఖమ్మం బీఆర్ఎస్లో విభేదాలు భగ్గుమన్నాయి. తనకు టికెట్ దక్కకపోవడానికి కారణం మంత్రి పువ్వాడ అజయ్ అంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు రాములు నాయక్. పువ్వాడ అజయ్ తీరుతో బీఆర్ఎస్ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని…జిల్లాలో ఆయన ఒక్కడే గెలిచి మిగిలిన నియోజకవర్గాల్లో అందరూ ఓడిపోయాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఖమ్మం జిల్లాకు సామంతరాజుగా పువ్వాడ అజయ్ వ్యవహరిస్తున్నాడని…ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఏకంగా పువ్వాడ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతేగాదు తన నియోజకవర్గంలో వేలు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. తనపై తప్పుడు రిపోర్టులు ఇచ్చి టికెట్ రాకుండా చేసింది కూడా పువ్వాడనే అని ఆరోపించారు.
ఇక రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే పొంగులేటి వంటి సీనియర్ నేతలు కూడా బీఆర్ఎస్ను వీడారు. ఇక పొంగులేటి అయితే ఏకంగా ఖమ్మం నుండి ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు దాటనివ్వనని శపథం చేశారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. సీనియర్ నేతలంతా పార్టీని వీడుతుండటం, సొంత పార్టీ నేతలు,ఎమ్మెల్యేల నుండే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.