ఆంధ్రప్రదేశ్పై కేంద్రంలోని బీజేపీ సర్కారు నిఘా పెంచింది. తాము కేంద్రం నుంచి విడుదల చేసిన నిధులు.. వాటితో రాష్ట్రంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు స్వయంగా కేంద్ర మంత్రులే ఏపీకి క్యూకడుతున్నారు. పోలవరం పనులను పరిశీలించేందుకు రెండు రోజుల కిందట గడ్కరీ అత్యవసరంగా ప్రత్యేక విమానంలో అమరావతిలో ల్యాండయ్యారు. బీజేపీకి రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటూ ఆ పార్టీకి చెందిన నాయకులు గన్నవరం విమానాశ్రయానికి భారీగా తరలివచ్చి.. అంతా కలిసి పోలవరాన్ని సందర్శించేందుకు వెళ్లారు. వీరితోపాటూ అధికార తెలుగుదేశం తరఫున లెక్కలు చెప్పేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పోలవరానికి వెళ్లారు.
పోలవరంలో జరుగుతున్న పనులను చూసిన గడ్కరీ బాగానే ఉన్నాయంటూ బయటకు ప్రకటించినా.. అంతర్గత వ్యూహం వేరే ఉందని వార్తలొస్తున్నాయి. గడ్కరీ ఇలా వెళ్లగానే.. మరో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా అమరావతికి హుటాహుటిన ఈ రోజు బయలుదేరి వచ్చారు. విజయవాడ, గుంటూరుకు మధ్యలో ఆంధ్రుల రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలో కడుతున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పనులను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై బెజవాడలో ఓ ప్రెస్మీట్ కూడా పెట్టారు. గుంటూరులో జరిగే పలు కార్యక్రమాలకు హాజరై పార్టీ శ్రేణులతో చర్చించారు. వీరిద్దరి కంటే ముందు.. రెండు రోజుల ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో జరిగే కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాష్ట్రంలో రెండు రోజులు ఉండి వెళ్లారు. నడ్డా వెళ్లిన తర్వాత.. మరికొందరు కేంద్ర మంత్రులు సైతం ఆంధ్ర్రప్రదేశ్కు వచ్చేందుకు ఇప్పటికే షెడ్యూల్లు ఖరారు చేసుకున్నారు.
కర్నాటక ఎన్నికల తర్వాత.. ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి సారిస్తామంటూ బీజేపీ అధిష్టానం దూతలుగా వచ్చిన రామ్మాదవ్ లాంటి వాళ్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. అయితే.. కర్నాటకలో ఫలితాలు తారుమారై బీజేపీకి వ్యతిరేకమవ్వడంతో.. ఏపీపై దృష్టిసారించే విషయంలో కొంత జాప్యమైంది. ప్రస్తుతం మోడీ, అమిత్షా జోడీ ఏపీపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. దానిలో భాగంగానే ముందుగా కేంద్రం నుంచి తాము ఈ నాలుగేళ్లలో విడుదల చేసిన నిధులు, వాటితో చేపట్టిన పనుల లెక్క తేల్చడానికి సన్నద్ధమయ్యారు. అందుకే.. ఒక్కొక్కరుగా కేంద్రమంత్రులు హుటాహుటిన ఏపీ రాజధానికి క్యూ కడుతున్నారు.
రాష్ర్టంలోని ప్రధాన ప్రాజెక్టు అయిన.. పోలవరంతోనే లెక్కలు కట్టడం ఆరంభించారు. తర్వాత ఎయిమ్స్, రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులు, ఒక్కో కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి ఏపీకి విడుదల చేసిన నిధులు.. వీటన్నింటినీ లెక్కించేందుకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని గుర్తించేందుకు ఈ పర్యటనలు చేస్తున్నట్టు.. బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు వెళ్లడించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో లోపాలు, అవినీతిని గుర్తించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడం కూడా బీజేపీ అధిష్ఠానం ఎత్తుగడలో ఓ భాగంగా కన్పిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనట్టే కనిపిస్తోంది.