ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దంటూ అసంతృప్త నేతలు ఆందోళనకు దిగుతున్నారు. దింతో ఉన్న పంచాయతీలు సరిపోనట్టు మళ్లీ ఇదొకటా అని తలలు పట్టుకుంటున్నారట. అయినా కూడా నేతలు తమ అసంతృప్తిని చంద్రబాబు వద్ద గట్టిగానే వినిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా పాయకరావుపేట, అనంతపురంలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తిరుగుబావుట ఎగరవేశారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో అసమ్మతి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అనిత అవినీతిపై నియోజకవర్గం నేతలు రెండు పేజీల లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను వారు చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనిత పాదయాత్రను అడ్డుకున్న నేతలు.. ఆమెకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అనితకు ఎమ్మెల్యే సీటు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక సమీక్షా సమావేశం నిర్వహిస్తే అది కాస్తా రసాభాసగా మారింది.
ఇక ఈ వార్తలన్ని పార్టీ సొంత మీడియాలో ఎక్కువగా ప్రచారమవుతున్నాయి. పాయకరావుపేట టికెట్ అనితకు కేటాయించే విషయంలో టీడీపీ అధిష్టానం డైలమాలో పడిందంటూ వార్తలు వచ్చేస్తున్నాయి.