రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకివచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. బెయిల్ కోసం పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక ఇవాళ ఏసీబీ కోర్టులో బాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుండగా చంద్రబాబు తరపున సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు.
ఈ నేపథ్యంలో బాబు క్వాష్ పిటిషన్పై కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీం. మంగళవారం ఈ పిటిషన్ను విచారిస్తామని వెల్లడించింది. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుండగా కేసుకు సంబంధించిన వివరాలను న్యాయమూర్తికి వెల్లడించారు సిద్ధార్థ్ లూథ్రా.
ఈ కేసు ద్వారా ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని తెలపగా సీజేఐ స్పందిస్తూ చంద్రబాబు ఎన్నిరోజుల నుంచి కస్టడీలో ఉన్నారని అడుగగా.. ఈనెల 8న అరెస్టు చేశారని లూథ్రా తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటీషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు తుదిదశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరపున వాదించిన రంజిత్ కుమార్ లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. రేపు క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుండగా సర్వోన్నత న్యాయస్ధానం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.