- బాబుపై కేటీఆర్ పొగడ్తాల వెనక ఆంతర్యమేమి?
- రాజధాని అమరావతిపై కూడా
ఇన్నాళ్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ అధికార పార్టీ మండిపడింది. చంద్రబాబు తెలంగాణను గబ్బు లేపడాన్ని తమదైనా భాషలో మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవితలు ఇప్పుడు చంద్రబాబుపై తమ వైఖరి మార్చివేశారు. చంద్రబాబును తరచూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకుంటున్నాడు. నవ్వుతూ.. హాయిగా మాట్లాడుకుంటున్నారు. ఏపీకి వెళ్లితే రెడ్ కార్పెట్ వేసుకొని స్వాగతాలు పలకడంపై కేసీఆర్ సంబరంలో మునిగిపోయాడు. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణకు దోస్త్గా అవుతున్నాడు. ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా టీడీపీని వీడడంతో తెలంగాణ అధికార పార్టీతో చంద్రబాబు సత్సంబంధాలు కోరుకుంటున్నాడు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించడమే ఆ పార్టీని రేవంత్ వీడడం ప్రధాన కారణం.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయ్యింది చంద్రబాబు వల్లనేనని, చంద్రబాబు సేవలు మరువలేనివని కొనియాడాడు. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిదేనని ప్రకటించారు. గురువారం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడాడు.
హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోనప్పుడు దాదాపు 17 ఏళ్ల కిందట మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను చంద్రబాబు ఒప్పించాడన్నారు. టెక్ మహీంద్రా సీఈఓ సి.పి.గుర్నానీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ చంద్రబాబును పొగిడారు. ‘మైక్రోసాఫ్ట్ కేంద్రం ఇక్కడ ఉండడం మా గొప్ప కాదు. నిజానికి ఈ ఘనత చంద్రబాబునాయుడుదే. మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని తీసుకురావడంలో బాబు తన తీవ్రంగా కృషి చేశారు అని ప్రకటించారు. భవిషత్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని ఆకాంక్షించారు. నగరాలను ఒక్క రోజులో నిర్మించలేమన్నారు. హైదరాబాద్ను ఒక్క రోజులో అభివృద్ధి చేయలేదని, ఈ నగరానికి 450 సంవత్సరాల చరిత్ర ఉందని పేర్కొన్నాడు.