తెలంగాణాలో ఎన్నికల ఫీవర్ మొదలయ్యింది. అసెంబ్లీ రద్దు ఆ వెంటనే కేసీఆర్ తమ పార్టీ అభ్యర్తులను ప్రకటించడంతో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. దీంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాహుల్ బఫూన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఘాటాగా కౌంటర్ ఇచ్చారు.
నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. కేసీఆర్ అన్ని దగా మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. నాలుగున్నరేళ్లలో లిక్కర్ సేల్స్ లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రైతుల ఆత్మహత్యలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు.
నాలుగున్నరేళ్లపాటు తెలంగాణ ప్రజలను దగా చేసిన కేసీఆర్ అద్భుత ప్రగతి సాధించినట్లు చెప్పడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ అన్ పాపులర్ అవుతాడనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు కళ్లు నెత్తికెక్కి పొగరుతో అహంకారంతో రాహుల్ గాంధీ ఫ్యామిలీపై లుచ్చామాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు.
మిషన్ భగీరథ కింద 5శాతం గ్రామాలకు కూడా నల్లా కలెక్షన్లు ఇవ్వలేదని అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, గిరిజన్లకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి తయారవుతున్నారని అన్నారు.
కేసీఆర్ కుటుంబసభ్యులకు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని అన్నారు. కేసీఆర్కు పోయేకాలం వచ్చింది కాబట్టే.. శాసనసభను రద్దు చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణా ప్రజల మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.