ప్రజా రంజక పాలన అందిస్తున్న వైసీపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. అదే సమయంలో తమ ఓటాయుధంతో టీడీపీని చావుదెబ్బ కొట్టారు. దీంతో అయిష్టంగా ఇన్నిరోజులుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న నేతలు కొందరు వైసీపీ వైపు జంప్ అయ్యేందుకు చూస్తున్నారట. ముఖ్యంగా సీఎం జగన్ సంక్షేమ పాలనకు జైకొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, కరణం బలరాం తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీకీ రాజీనామా చేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అధికార వైసీపీకి అఖండ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వారంతా టీడీపీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి.. వైసీపీ గుర్తుపై గెలవాలని చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుకు జగన్కు అదే తేడా
2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంపై వైసీపీ తీవ్ర అభ్యంతర తెలిపింది. సంతలో పశువుల్లాగా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని శాసనసభ స్పీకర్కు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా లాభం లేకపోయింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న వైసీపీ నవరత్నాల పాలనతో ప్రజలకు చేరువైంది. అదే సమయంలో టీడీపీ ప్రజల నమ్మకానికి దూరమైంది.
జగన్ సంక్షేమ పాలన, టీడీపీ అధినేత చంద్రబాబు ఒంటెద్దు పోకడలతో విసిగిన చాలా మంది టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఎమ్మెల్యేలకు ఆ వెసులుబాటు లేదు. చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ఒప్పుకోలేదు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరాలని ఆయన ఓ నిబంధన పెట్టారు. ఇక చాలాకాలంగా ఇదే విషయమైన ఆలోచిస్తున్న టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నిక తర్వాత రాజీనామాల నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Also Read : తిరుపతి ఉప ఎన్నిక: కూకట్ పల్లి మాదిరిగానే..