తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ గడువు దగ్గర పడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారీటీకి వచ్చాయి. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ బరిలో దిగనున్నారు. ఇక ముందునుంచీ తామంటే తామే పోటీ చేస్తామని ప్రకటించుకున్న జనసేన, బీజేపీలు చర్చోపచర్చల అనంతరం ఓ స్పష్టతనిచ్చాయి. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ వ్యక్తే ఉంటారని పేర్కొన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిణి రత్న ప్రభ బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ పార్టీ వర్గాలేవీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
నామినేషన్ వేసిన పనబాక
తిరుపతి లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరులో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ 7.77 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే తనపై ఎటువంటి పోలీసు కేసులు లేవని తెలిపారు. ఇదిలాఉండగా.. పనబాక అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో, స్థానికంగానూ కొంత ట్రోలింగ్ నడుస్తోంది. ఓడిపోతామని తెలిసినా పనబాకను చంద్రబాబు పోటీలో పెట్టారని అంటున్నారు.
గతంలో కూకట్పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినిని ఏ విధంగా రంగంలోకి దించారో ఇప్పుడూ అదే చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పనబాకను మరో సుహాసినిగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీకి ఏదో చేస్తున్నట్టు కవరింగ్ ఇచ్చుకోవడానికే టీడీపీ అధినేత చంద్రబాబు హరికృష్ణ కూతురిని చివరి నిముషంలో ఖరారు చేశారని గుర్తు చేస్తున్నారు.
పార్టీ మారదామనుకుంటే..
గత లోక్సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీచేసిన పనబాక వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దాంతోపాటు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో మనుగడ కష్టమనుకున్న ఆమె పార్టీ మారదామని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే, ఆమెను ఇరుకున పెట్టాలని, పార్టీ వదిలి వెళ్లకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని, పనబాకను సంప్రదించకుండా తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించారని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసినా గెలుపు దక్కలేదని, ఆర్థికంగానూ పరిస్థితులు సరిగా లేవని పనబాక సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. మొత్తం మీద బాబు పొలిటికల్ గేమ్లో పావుగా మారిన పనబాక నామినేషన్ వేయక తప్పలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.
దేశంలో మన రాష్ట్రానికీ మరో రికార్డ్..!