ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, టిఆర్ఎస్ మద్య రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. రాబోయే ఎన్నికలకు ఏడాదిన్నర సమయమే ఉండడంతో ఈ ఇరుపార్టీలు కూడా పరస్పర విమర్శలతో, ఆరోపణలతో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. తెలంగాణలో రోజురోజుకూ బీజేపీ బలం పెంచుకుంటూ ఉండడంతో ఆ పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నలే చేస్తోంది. ఇక బీజేపీ కూడా టిఆర్ఎస్ ను గద్దె దించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు చేస్తోన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. హుజూరాబాద్ క్యాంపు ఆఫీస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలోకి వచ్చేందుకు ఇతర పార్టీల నేతలు తనతో టచ్ లో ఉన్నారని, ఊహకందని రీతిలో చేరికలు ఉంటాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికరంలోకి వచ్చేందుకు తనకు అధిష్టానం బాద్యత అప్పగించిందని, వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ ను ఓడించడమే తన లక్ష్యమని ఈటెల చెప్పుకొచ్చారు.
అయితే ఇలాంటి వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్నప్పటికి, చేరికల విషయంలో ఈటెల చేసిన వ్యాఖ్యాలే ఇప్పుడు కొత్త చర్చలకు తావిస్తోంది. ఎందుకంటే టిఆర్ఎస్ లో గతేడాది కంటే ముందు ఈటెల బలమైన నేతగా ఉన్నాడు. దాంతో టిఆర్ఎస్ లోని చాలా మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు ఆకర్శించేందుకు ఈటెల వ్యూహాలు రచించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా టిఆర్ఎస్ బలా బలహీనతలు ఈటెలకు బాగా తెలిసిఉండడంతో చేరికల విషయంలో కచ్చితంగా టిఆర్ఎస్ కు దెబ్బ పడే అవకాశం ఉంది. మరి ఎత్తుకు పైఎత్తు వేయడంలో కేసిఆర్ సిద్ద హస్తుడు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈటెల వ్యూహాలను కేసిఆర్ ఎలా తిప్పికొడతారు ? అనేది ఆసక్తికరమైన అంశం. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ వర్సస్ టిఆర్ఎస్ అనే కన్నా కేసిఆర్ వర్సస్ ఈటెల రాజేందర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: