నేటి నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం జగన్. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత నేటి నుండి 21 రోజుల పాటు 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఇడుపుల పాయ నుండి ఇఛ్చాపురం వరకు ఈ యాత్ర సాగనుంది.
బస్సుయాత్రలో భాగంగా ప్రతీ రోజు ఒక బహిరంగసభలో పాల్గొననున్నారు జగన్. అలాగే ప్రతీ రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సమావేశాలు ఉండనున్నాయి. వారి నుండి సలహాలు స్వీకరించనున్నారు జగన్. ఇక తొలి బహిరంగసభ ప్రొద్దుటూరులో ఉండనుండగా వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి.
ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరుతారు సీఎం జగన్. అక్కడి నుండి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
అనంతరం సున్నంపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు.
రాత్రి అక్కడే బస చేస్తారు.