నంద్యాల ఉపఎన్నికలోనూ, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోవడంతో జగన్మీద, ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మీద పార్టీ నేతలనుంచి విమర్శలు వచ్చాయి. అయితె ఇప్పుడు మాత్రం ఆపార్టీలో ఉత్సాహం నెలకొంది. ఓటములనుంచి పార్టీని గట్టేందుకు ప్రశాంత్ కిషోర్ చేపట్టిన చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయి. నిన్నటి దాకా పీకె పై విమర్శలు గుప్పించిన వారు ఇప్పుడు ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. అందుకేసం వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకుంది. చంద్రబాబు లాంటి ఉద్దండుడి ముందు పీకే వ్యూహాలేం పనికిరావని, ఆయనకు డబ్బులివ్వడం దండగని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ జగన్ మాత్రం పీకేపై విశ్వాసం ఉంచారు. దీంతో పీకే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. పార్టీపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పలు కార్యక్రమాలకు వ్యూహరచన చేశారు.
పీకే చేపట్టిన తొలి ఆపరేషన్ వైఎస్ఆర్ కుటుంబం సూపర్ సక్సెస్ అయ్యింది . ఇంటింటికీ తిరిగి ఇంట్లో కనీసం ఒక్కరినైనా వైసీపీ పట్ల ఆకర్షితులయ్యేలా చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంటి సభ్యుల మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారిని పార్టీ అభిమానులుగా భావిస్తుంది. వై.యస్. వర్ధంతి రోజున ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించినా… 12వ తేదీ నుంచి అధికారికంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి వైసీపీలో ఫుల్ జోష్ వ్యక్తమవుతోంది.
తొలిరోజే వై.ఎస్.ఆర్. కుటుంబంలో 4 లక్షల మంది సభ్యులుగా చేరినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఇదే ఊపులో ముందుకెళ్తే పార్టీ మరింత పటిష్టం కావడం ఖాయమని నేతలు భావిస్తున్నారు. మిస్డ్ కాల్ రెస్పాన్స్ తీసుకొచ్చిన పీకేపై నేతల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.