“నేను ప్రశ్నిస్తానని, విమర్శిస్తానని పలువురు పేర్కొంటుంటారు. వారందరికీ చెప్పేది ఒకటే… అడుగుతామబ్బా… కొమ్ముకాశాం.. అడగమా?” అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానని గుర్తుచేశారు.
‘అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను కష్టాలపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోము’ అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నాయకులను సంపాదించుకోవద్దని తాను అనడం లేదని, ఒకవేళ తాను అలా చెప్పినా వారు సంపాదించుకోవడం మానరని, ఆ విషయం తనకు తెలుసని ఆయన చెప్పారు. అందుకే సొంత లాభం కొంత మానుకుని ప్రజల కోసం పాటుపడమంటున్నానని ఆయన తెలిపారు. అలా కాకుండా ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టి, సంపాదించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆయన చెప్పారు.
ఆంధ్రానాయకులను దద్దమ్మల్లారా, సన్నాసుల్లారా.. అని తెలంగాణ నాయకులు తిడుతుంటే తనకు బాధ కల్గిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వాపోయారు. ‘తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకులను ‘సన్నాసి’ అంటే.. ‘ఏమండీ, ఇది పద్ధతి కాదు’ అని సీమాంధ్ర నాయకులు అంటారు. ‘చవటల్లరా’ అంటే, ‘అలాంటి మాటలు మేమూ మాట్లాడొచ్చు, కానీ, మేము మాట్లాడము’ అని సీమాంధ్ర నాయకులు అంటారు’ అని పవన్ అన్నారు.ఈ విధంగా వారు తిడుతున్న సందర్భాలను చూస్తుంటే తనకు చాలా బాధ వేసేదని, కనీసం, మన నాయకులు ‘ఎందుకు తిడుతున్నావు?’ అని ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు.
అంతేకాకుండా, సీమాంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే వారిని తొట్టొద్దని కాంగ్రెస్, టీడీపీ… అసలు ఏ పార్టీకి చెందిన నాయకులైనా కనీసం ఒక్కరన్నా ప్రశ్నించారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అందుకనే, సీమాంధ్ర ప్రాంత ఎంపీలంటే ఢిల్లీలో చాలా చులకనై పోయారని, వారిని బయటకు పంపించిమరీ రాష్ట్రాన్ని విడగొట్టారని, ఇదంతా చూసి తనకు ఏడుపొచ్చిందని పవన్ అన్నారు.‘నా గుండెల్లో మాట చెప్పడానికి, మీ గుండెల్లో మాట చెప్పడానికి నేనెప్పుడూ వెనుకాడను’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ‘సమస్యలను ఎదుర్కొనేటప్పుడు నాకు భయం లేదు. ఏ స్థాయి రాజకీయనాయకులైనా, జాతీయ స్థాయి నాయకులైనా భయం లేదు.
వాళ్లకు గూండాలుంటారా? ఎవరుంటారు వాళ్లకు? మనకు ఎవరూ లేరు. మనకు మనమే ఒక సైన్యం.. జనసైన్యం. మనం జనసైన్యమా? కాదా? మనకు గూండాలవసరం లేదు.. దుర్మార్గుల అవసరం లేదు.. మనకు డబ్బులవసరంలేదు.. మనకు భగవంతుడున్నాడు, సత్యం ఉంది.. మన గుండెల్లో ధైర్యం ఉంది. పోరాడే పటిమ ఉంది.. గుండెల నిండా ఆత్మ గౌరవం ఉంది.. మనకు పౌరుషం ఉంది’ అంటూ పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.
Related