విదేశీ పర్యటనల్లో భార్యలు మరియు గాళ్ఫ్రెండ్స్ భారత క్రికెటర్లతో కలిసి ఉండటానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసిసిఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యర్థనకు బీసిసిఐ అంగీకరించింది. అయితే ఓ కండీషన్ను పెట్టింది.
భారత జట్టు విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో పది రోజుల తర్వాత క్రికెటర్లతో కలిసి వారి భార్యలు, గాళ్ఫ్రెండ్స్ ఉండొచ్చని అనుమతించింది. బీసిసిఐ నిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చి, వారిని టూర్ మొత్తానికీ అనుమతించాలని ఈ మధ్యే కెప్టెన్ కోహ్లి బీసీసీఐని కోరాడు.
ఆసియాకప్కు ముందు ఇంగ్లండ్ టూర్కి వెళ్లిన భారత జట్టుకు కఠిన నిబంధనలు విధించింది బీసీసీఐ. భార్యలను, ప్రియురాళ్లను తీసుకెళ్లకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం ఇంగ్లండ్లో ప్రత్యక్షమైంది. అంతేకాదు బీసీసీఐ అధికారిక విందులకు కూడా ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో బీసీసీఐ ద్వంద్వ నిబంధనలపై విమర్శలు చెలరేగాయి. రోహిత్ శర్మ, సెహ్వాగ్ లాంటి వాళ్లు ప్రత్యేక్షంగానే బీసీసీఐ తీరును విమర్శించారు.
ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు కెప్టెన్ విరాట్ కొహ్లీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్కు ఓ లేఖ రాశాడు.ఈ క్రమంలో దీనిపై చర్చించడానికి గతవారం సీఓఏ హైదరాబాద్ వచ్చి.. కోహ్లితోపాటు కోచ్ రవిశాస్త్రి, రోహిత్శర్మలతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.