టోర్నీ ప్రారంభమై ఆరు రోజులైంది…అన్ని జట్లు మైదానంలో దిగాయి… ఇప్పటికే ఏడు మ్యాచ్లు జరిగిపోయాయి. కాని భారత్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో భారత్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం భారత్ తొలి మ్యాచ్ను సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓడిన సఫారీలు ఒత్తిడిలో ఉన్నారు. ఇక భారత్ కూడా మొదటి మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు.
ప్రస్తుతం ఇండియా, సఫారీల మధ్య మ్యాచ్కు సంబంధించి ఓ ఆసక్తికర సెంటిమెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ రెండు వరల్డ్ కప్ లు ఆడిన కోహ్లీ…రెండు వరల్డ్ కప్ లలోనూ భారత జట్టు, తన తొలి మ్యాచ్ లలో విజయం సాధించగా, ఈ రెండింటిలోనూ కోహ్లీ సెంచరీలు కొట్టాడు.
2011లో బంగ్లాదేశ్ తో మీర్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఇక, 2015లో ఆడిలైడ్ లో పాకిస్థాన్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో 126 బంతుల్లో కోహ్లీ 107 పరుగులు చేశాడు. ఇప్పుడు కూడా ఆనవాయితీగా వచ్చిన తొలి మ్యాచ్ సెంచరీని కోహ్లీ సాధిస్తాడని, భారత విజయం కూడా ఖాయమని అభిమానులు అంటున్నారు.