టీమిండియా క్రికెటర్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి అంతర్జాతీయ మ్యాచ్ల్లో బౌలింగ్ చేయదాదని నిషేధం విధించింది. అయితే దేశవాళీ, బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీలలో మాత్రం బౌలింగ్ చేయవచ్చని తెలిపింది.
ఆస్ట్రేలియాతో సిడ్నీలో ముగిసిన మొదటి వన్డే మ్యాచ్లో రాయుడు అనుమానస్పదంగా బౌలింగ్ చేసాడు. రాయుడు బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందని మ్యాచ్ రిఫరీ.. ఐసీసీకి ఫిర్యాదు చేసాడు.దీంతో రాయుడు తన బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని ఐసీసీ 14 రోజుల గడువు ఇచ్చింది. అయితే ఈ పరీక్షకు ఈ హైదరాబాద్ ఆటగాడు హాజరుకాకపోవడంతో నిబంధనల మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
న్యూజిలాండ్ పర్యటనతో బీజీగా ఉన్న రాయుడు జగనవరి 13 న పరీక్షకు హాజరు కాలేదు. దీంతో ఐసీసీ క్లాజ్ 4.2 నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. రాయుడు పరీక్షకు హాజరై, తన బౌలింగ్ యాక్షన్ సరైనదేనని నిరూపించుకునే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
ఇక పార్ట్టైమ్ స్పిన్నర్ రాయుడు తన 46 మ్యాచ్ల వన్డే కెరీర్లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు.