చాలా రోజుల తర్వాత టెస్టు జట్టులో చోటు సంపాదించిన రోహిత్ .. సాగరతీర నగరం వేదికగా దక్షిణాఫ్రికాతో మొదలైన తొలి టెస్ట్లో రోహిత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ముంబైకర్ కొట్టిన కళాత్మక షాట్లకు విశాఖ స్టేడియం హోరెత్తిపోయింది. ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 115తో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ (176: 244 బంతుల్లో 23×4, 6×6).. స్పిన్నర్ కేశవ మహరాజ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. టెస్టుల్లో రోహిత్ కు నాలుగో సెంచరీ.
ఓపెనర్ గా తన మార్క్ ను చూపించిన రోహిత్ ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్మన్ రోహిత్ నిలిచాడు.మరొకవైపు ఓపెనర్గా వచ్చి మూడు ఫార్మాట్లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ రోహిత్ రికార్డు సృష్టించాడు. దీంతో సొంత గడ్డపై అత్యధిక టెస్టు యావరేజ్ నమోదు చేసిన ఆటగాళ్లలో డాన్ బ్రాడ్మన్ సరసన చేరాడు.
టెస్టుల్లో మొత్తం 80 ఇన్నింగ్స్లు ఆడిన బ్రాడ్మన్ 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో 99.94 సగటు నమోదు చేశాడు. కాగా, బ్రాడ్మన్ తన సొంత గడ్డ ఆస్ట్రేలియాలో మాత్రం 50 ఇన్నింగ్స్ల్లో 98.22 సగటు సాధించాడు. అదే ఘనతను రోహిత్ సాధించాడు. సొంత గడ్డపై ఇప్పటివరకూ 15 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ 98.22 టెస్టు సగటుతో 884 పరుగులు సాధించాడు. ఇందులో నాల్గో సెంచరీలతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.