భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్లపై పాక్ స్టార్ బ్యాట్సమేన్ పాక్ మాజీ కెప్టెన్ అఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడల్లోకి రాజకీయాలు తీసుకురావొద్దని అఫ్రిది సూచించాడు. 2014లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2015-2023 మధ్యకాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్లు జరగాల్సి ఉంది. కానీ.. పాకిస్థాన్ తరచూ కాల్పుల ఒప్పందాన్ని విరమిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుండటంతో భారత్ ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు విముఖత ప్రదర్శిస్తోంది.
దీంతో.. మ్యాచ్లు జరగకపోవడంతో తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని.. బీసీసీఐ నుంచి పరిహారం ఇప్పించాలంటూ పీసీబీ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఆశ్రయించింది. అయితే ఇరుదేశాలకు ఆడటం ఇష్టంలేనప్పుడు మేము చేసేదేమిలేదని ఐసీసీ చేతులెత్తేసింది.
రాజకీయాలకి దూరంగా క్రీడలు ఉండాలనేది నా అభిమతమన్నారు. ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం పెంపొందేందుకు క్రీడలు ఒక వారధిలా పనిచేస్తాయన్నారు. దేశాల మధ్య శాంతిని కూడా నెలకొల్పడంలో క్రీడలదే ప్రముఖపాత్ర’ అని అఫ్రిది వెల్లడించాడు. ఇటీవల భారత రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వద్ద ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన ఒప్పందం గురించి ప్రస్తావనరాగా.. ఇప్పట్లో దాయాది దేశంతో క్రికెట్ మ్యాచ్లు ఆడటం అసాధ్యమంటూ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలోనే అఫ్రిది రాజకీయాల ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. అఫ్రీది వ్యాఖ్యలకు బీసీసీఐ స్పందిస్తుందోలేదో చూడాలి.