విండీస్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా విజయాలతో దూసుకుపోతోంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్విప్ చేయడంతో ఇప్పుడు వన్డేసిరీస్ పై గురిపెట్టింది. ప్రపంచకప్ సెమీస్లో ఓటమి తర్వాత పరాయిగడ్డపై 50 ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటి ఆత్మైస్థెర్యాన్ని పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది కోహ్లీసేన.
పనిలో పనిగా వెటరన్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సమర్థంగా భర్తీ చేయాలని; బ్యాటింగ్ ఆర్డర్లో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న నంబర్–4 స్థానానికి పరిష్కారం దొరకాలని ఆశిస్తోంది. నెంబర్ 4లో కొత్త వారిని ఆడించాలని ప్రయోగానికి సిద్దమయ్యింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం ఇక్కడి ప్రావిడెన్స్ మైదానంలో విండీస్తో తొలి మ్యాచ్ ఆడనుంది. యువపేసర్లు సైనీ, ఖలీల్ ప్రతిభకు ఈ సిరీస్ పరీక్ష కానుంది.
వన్డే ప్రపంచ కప్ నుంచి గాయంతో వైదొలగిన ధావన్ తాజా టి20 సిరీస్లో ఆకట్టుకోలేకపోయాడు. టీ20 సిరీస్ మూడు మ్యాచ్ల్లోనూ(1,23,3) తీవ్రంగా నిరాశ పరిచిన శిఖర్.. ఫామ్లోకి రావడం జట్టుకు ఎంతో అవసరం. కోహ్లీ వన్డౌన్లో రావడం తథ్యం కాగా… కేఎల్ రాహుల్ మళ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. విశ్వటోర్నీలో ఆ స్థానంలో కాస్త కుదురుకున్నట్టు కనిపించిన రాహుల్..ధవన్ గాయం కారణంగా మళ్లీ ఓపెనర్గా వచ్చిన సంగతి తెలిసిందే.