ముంబయ్ యువ ఆటగాడు ఇషాంత్ కిషన్ మెరుపులు మెరిపించాడు. సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించాడు. కోల్కతా బౌలర్లపాలిట సింహస్వప్నంలా చెలరేగిపోయాడు. స్లో రన్రేట్తొ కొనసాగుతున్న జట్టుకి తన బ్యాటింగ్తో బూస్ట్ తెప్పించాడు. స్టేడియం నలువైపులా భారీ షాట్లతో అలరించాడు. 21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 జట్టుకి భారీ స్కోరు సాధించిపెట్టాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో ముందుకెళ్లాలంటే వెనక్కి చూసుకోకుండా ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ముంబై ఇండియన్స్ది. ఆడేది లీగ్ మ్యాచే అయినా ముంబైకిది నాకౌట్తో సమానం. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆప్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి కీలక తరుణంలో ముంబై 102 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై ఘనవిజయం సాధించింది స్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో యువ హిట్టర్ ఇషాన్ కిషన్ (62: 21 బంతుల్లో 5×4, 6×6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ (32 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), లూయిస్ (13 బంతుల్లో 18; 3 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు 46 పరుగులు జోడించాక పీయూష్ చావ్లా వేసిన ఆరో ఓవర్లో లూయిస్ నిష్క్రమించాడు.
తర్వాత కెప్టెన్ రోహిత్ జతయ్యాడు. కానీ రన్రేట్ మాత్రం ఓవర్కు ఏడు పరుగులకు మించలేదు.క్రీజులోకి ఇషాన్ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఒక్కసారిగా పరుగుల వాన మొదలైంది. సారథి ఇచ్చిన అండతో కిషన్ భారీ షాట్లకు తెగబడ్డాడు. ఉన్నంతసేపూ… బంతులేసిన బౌలర్లకు చుక్కలు చూపించాడు.
లక్ష్య ఛేదనలో తడబడిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు 18.1 ఓవర్లలో108 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో క్రిస్లిన్ (21), రాబిన్ ఉతప్ప (14), నితీశ్ రానా (21), ఆండ్రీ రసెల్ (2), దినేశ్ కార్తీక్ (5) ఒత్తిడిలో చిత్తయ్యారు. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ఆరంభంలో క్రిస్లిన్, మిడిల్ ఓవర్లలో కార్తీక్ రనౌటవడం కోల్కతా విజయావకాశాల్ని దెబ్బతీసింది. టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని అందుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోగా.. కోల్కతా మిగిలిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు గెలవాల్సిన సంకట స్థితిలో పడిపోయింది.