ఐపీఎల్ 2018లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా మూడు మ్యాచ్ల అనంతరం అద్భుత విజయంతో అభిమానుల్లో ఉత్సాహం నింపింది. వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై… కెప్టెన్ రోహిత్ (52 బంతుల్లో 94; 10 ఫోర్లు, 5 సిక్స్లు), ఓపెనర్ ఎవిన్ లూయీస్ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్లు) విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
కోహ్లి (62 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం మినహా ప్రధాన బ్యాట్స్మెన్ కనీస పరుగులు కూడా చేయలేకపోవడంతో బెంగళూరు ఛేదనలో తేలిపోయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడిపోయింది. ముంబై బౌలర్లలో కృనాల్ (3/28), బుమ్రా (2/28), మెక్లీనగన్ (2/24) క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కోలు కోనివ్వలేదు. రోహిత్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్లు క్వింటన్ డీకాక్ (19), విరాట్ కోహ్లి మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే 5వ ఓవర్లో డీకాక్, డివిలియర్స్(1)ను మెక్క్లెనాగన్ ఔట్ చేశాడు. తొలి బంతికి డీకాక్ను బౌల్డ్ చేసిన మెక్.. నాలుగో బంతికి ఏబీని పెవిలియన్కు పంపాడు. ఇక ఇక్కడి నుంచి బెంగళూరు పతనం ఆరంభమైంది. ఓ వైపు విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నా అతనికి సహచరుల నుంచి సహకారం అందలేదు
0/2… ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకు ముంబై పరిస్థితిది. ఈ సీజన్లో స్థిరంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (0)లు ఉమేశ్ పేస్ ధాటికి ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యారు. ఇలాంటి దశ నుంచి పైకి లేచి భారీ స్కోరు సాధించిందంటే ఆ ఘనతంతా లూయీస్, రోహిత్దే. వికెట్లు కోల్పోయిన ప్రభావం నుంచి జట్టును వీరు త్వరగానే బయట పడేశారు.