ఐపీఎల్-2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లకు తీవ్ర నిరాశే ఎదురుకాగా, యువ ఆటగాళ్లు భారీ ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. దీంతో వారిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత వేలంలో భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్లు ఊహించని రీతిలో జాక్ పాట్ కొట్టారు. రూ.11 కోట్ల ధరకు కొనుగోలు అయ్యారు. మనీశ్ పాండే కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ జట్లు రేట్లు పెంచుకుంటూ పోగా పదికోట్ల మార్కు చేరుకున్నాక సన్రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. 11 కోట్ల ధరకు మనీశ్ పాండేను సన్రైజర్స్ సొంతం చేసుకుంది.
టీమిండియా మరో యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ కోసం జరిగిన వేలం ఆసక్తికరంగా జరిగింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్లు హోరాహోరీగా ధరను పెంచుతూ ఉత్కంఠ రేపారు. చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ రూ.11 కోట్లతో రాహుల్ను దక్కించుకుని అతడిపై అంచనాలు పెంచేసింది.
కరుణ్ నాయర్ ను సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5.6 కోట్లతో కొనుగోలు చేసింది. మరోవైపు ట్వంటీ20ల్లో మంచి పేరున్న హార్డ్ హిట్టర్ యూసఫ్ పఠాన్ కేవలం 1.9 కోట్లకు కోనుగోలు కావడం గమనార్హం. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ ధరకు పఠాన్ను తీసుకుంది.
ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అమ్ముడుపోలేదు. క్రిస్ గేల్ తర్వాత అమ్ముడుపోని రెండవ ప్లేయర్ జోరూట్. మనీష్ పాండే కూడా జాక్పాట్ కొట్టాడు. మనీష్ పాండేను హైదరాబాద్ సన్రైజర్స్ టీమ్ కైవసం చేసుకున్నది. అతన్ని రూ.11 కోట్లకు సన్రైజర్స్ గెలుచుకున్నది.