ఈ ప్రపంచకప్ తర్వాత చాలా మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే గేల్, రాయుడు, అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ స్టార్ ఆటగాడు, హైదరాబాద్ అల్లుడు సోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా షోయబ్ ఈ విషయాన్ని ప్రకటించగా, నెటిజన్స్ షాక్ అవుతున్నారు.తనతో ఆడిన ఆటగాళ్ళకి, శిక్షణ ఇచ్చిన కోచ్లకి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా, స్పాన్సరర్స్ కు ఈ సందర్బంగా షోయబ్ ధన్యవాదాలు తెలిపాడు.
1999లో తొలి వన్డే ఆడిన మాలిక్ 20 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో పాక్కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు . వన్డేలలో షోయబ్ మాలిక్ 9 సెంచరీలు, 44 అర్ద సెంచరీలు చేశారు.
షోయబ్ మాలిక్ రిటైర్మెంట్ పై అతని భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మాలిక్ను చూస్తే నాకు గర్వంగా ఉందంటూ తనపై భర్తపై ప్రశంసల జల్లు కురిపించారు సానియా. “ప్రతీ కథకి ఒక ముగింపు ఉంటుంది. జీవితంలో ప్రతీ ముగింపునకూ కొత్త అవకాశం ఎదురుచూస్తుంది. మాలిక్.. 20 ఏళ్ల పాటు నీ దేశం తరఫున ఎంతో నిబద్ధతతో వినయంగా ఆడావు. నువ్వు సాధించిన వాటికి నేను, ఇజాన్ ఎంతో గర్వపడుతున్నాం” అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు సానియా మీర్జా.
వరల్డ్ కప్లో షోయబ్ మాలిక్ ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడిన మాలిక్ కేవలం 8 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా, భారత్లపై అతను డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్లో రెండో బంతికి, టీమిండియాతో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు షోయబ్ . ఈ క్రమంలో అతనిని మిగతా మ్యాచ్లకి ఎంపిక చేయలేదు. మరోవైపు ప్రపంచకప్ అధికారిక ట్విట్టర్ తమ ట్విట్టర్లో పాకిస్థాన్ టీం షోయబ్ మాలిక్కి గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న వీడియోని షేర్ చేసింది.