చాలా ఏళ్లగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న ఒకటయ్యారు. కేవలం అత్యంత సన్నిహితుల నడుమ పెళ్లి వేడుక చేసుకున్నారు. నూతన వధూవరులకు అభిమానుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ కండోమ్ బ్రాండ్లు కూడా నూతన వధూవరులకు చమత్కారంగా శుభాకాంక్షలు తెలియజేశాయి. ఈ జంట ‘తొలిరేయి’ ఎన్నడూ లేనంత సురక్షితమైన రీతిలో జరగాలని విష్ చేశాయి. రణబీర్-ఆలియా వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ప్రముఖ కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.
“డియర్ రణబీర్, అలియా, మీ వేడుకలో మేం లేకుంటే సరదానే లేదు” అంటూ రాసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. స్కోర్, మ్యాన్ఫోర్స్ లాంటి ప్రసిద్ధ కండోమ్ బ్రాండ్లు కూడా ఇదే బాటను అనుసరించాయి. అలియా, రణ్బీర్లకు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాయి. “హే రాక్స్టార్, మాకు యే జవానీ హై దీవానీ తెలుసు, కానీ ఆమె రాజీ అయినప్పుడు మమ్మల్ని గుర్తుంచుకో” అని స్కోర్ సంస్థ పోస్ట్ చేసింది.
మ్యాన్ఫోర్స్ కండోమ్ సంస్థ కూడా వెరైటీగా స్పందించింది. “మేం వివాహాలకు హాజరుకాము, కానీ ఆ తరువాత అసలైన మజాను పెంచుతాం.” అంటూ ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. ఈ తరహా విషెస్ చెప్పిన కంపెనీలపై ఇంటర్నెట్లో నెటిజన్లు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు. రణబీర్, అలియాల పై కండోమ్ బ్రాండ్స్ సృజనాత్మకను కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు. ఎంతో చమత్కారంతో కూడిన ఆకట్టుకునే ట్వీట్స్ను అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఐదేళ్ల క్రితం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్న సమయంలో రణ్బీర్, అలియా ప్రేమలో పడ్డారు.