ఏపీలో ఉగ్రదాడులు జరగవచ్చన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తయం అయ్యింది. అత్యవసరంగా డీజీపీ ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను సమీక్షించారు.
ఇస్లామిక్, వామపక్ష తీవ్రవాదం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు.ఇటీవల శ్రీలంకలో ఉగ్రదాడులు, మరోపక్క వామపక్ష తీవ్రవాదం నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయని ఆర్పీ ఠాకూర్ తెలిపారు.
శ్రీలంకలో బాంబు దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించిన ఆయన.. భద్రతా పరమైనలోపాలను గుర్తించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. రాష్ట్రంలో భద్రతను, తనిఖీలను మరింత పెంచాలని సూచించారు. ఎక్కడైనా భద్రతా పరంగా లోపాలుంటే నెల రోజుల్లో సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉగ్ర దాడులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ పునరుద్ఘాటించారు.