ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నేరుగా పూణెకు తరలించనున్నారు. ఈ ఉదయం నుంచి హైదరాబాదులోని వరవరరావు నివాసంలో పూణె పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన నివాసంలో ఉన్న ప్రతి పేపర్ ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు, విచారణ, సోదాలను పూర్తి స్థాయిలో వీడియో తీశారు.
ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు
సోమవారం ఉదయం నుంచి నాలుగు బృందాలు గాంధీనగర్లోని వరవరరావు ఇంటితో పాటూ.. ఆయన కుమార్తె.. ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, ఓ సీనియర్ జర్నలిస్ట్, టేకుల క్రాంతితో పాటూ మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో సోదాలు చేశారు. అలాగే వరవరరావును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వరవరరావును అదుపులోకి తీసుకుంటున్నట్టు కాసేపటి క్రితమే ఆయన కుటుంబ సభ్యలుకు పోలీసులు తెలిపారు. కాసేపట్లో ఆయనను ఆయన నివాసం నుంచి బయటకు తీసుకురానున్నారు. వరవరరావును తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఓ పోలీసు వాహనం అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లోకి వెళ్లింది.
వరవరావు అరెస్ట్ గురించి అధికారికంగా పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే, వరవరరావును నేరుగా పూణెకు తీసుకెళ్తారా? లేదా హైదరాబాదులో కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత పూణెకు తరలిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. వరవరరావును నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.