పుల్వామా ఘటన తర్వాత భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసి. ‘మిస్టర్ పాక్ పీఎం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు… అణు బాంబులు మీ దగ్గరే కాదు.. మా వద్ద కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయ్ …మీకంటే మేము ఇంకా బాగా ప్రయోగించగలం అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జైష్ ఎ మహ్మద్, లష్కర్ ఎ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను ముందు నాశనం చెయ్యి అంటూ హితవు పలికారు.
ఇమ్రాన్ తాను టిప్పు సుల్తాన్లాగా పోల్చుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు అసదుద్దీన్. అయన హిందువులకు ఎప్పుడూ వ్యతిరేకంగా పోరాడలేదని…తన రాజ్యానికి శత్రువులుగా ఉన్న వారిపైనే పోరాడారే తప్ప అమాయక ప్రజలను చంపలేదన్నారు.
భారత దేశ శత్రువే తమ శత్రువని, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఇక్కడ స్థానం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇస్లాం పేరుతో ముస్లింలను వంచించడం తగదని, ఇస్లాం అనేది ప్రపంచంలోని అన్ని మతాల్లోకెల్ల ఎంతో శ్రేష్ఠమైనదని గుర్తుచేశారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు ముస్లింలు ఎల్ల వేలలా సిద్దంగా ఉంటారని ఉద్వేగంగా మాట్లాడారు. భారత ముస్లింలుగా దేశం కోసం అహోరాత్రాలు శ్రమిస్తాం. మా సైనికులకు ఏ చిన్న ఆపద వచ్చినా వెన్నంటి నిలిచి కాపాడుకుంటాం’ అని అసదుద్దీన్ అన్నారు. ఎంఐఎం పార్టీ 61 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దారుస్సలాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అసదుద్దీన్.