తెలంగాణాలో శాసనసభ రద్దు అవడంతో మొదటి అంకం ముగింసింది. ఇక మిగిలింది ఎన్నికల సమరమే. వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే నవంబర్లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఈసీ దృష్టి సారించింది.
తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. ఈ నెల 11వ తేదీన ఈసి ప్రతినిధి బృందం హైదరాబాద్ రానుంది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో ఆ ప్రతినిధి బృందం రాష్ట్రానికి వస్తుంది. ఎన్నికల ఏర్పాట్లపై, ఎన్నికల సాద్యాసాధ్యాలపై ఈసి ప్రతినిధి బృందం పరిశీలన జరుపుతుంది.
రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రతినిధి బృందం ఓ నివేదిక సమర్పించనుంది. ఈ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. తెలంగాణలో గురువారం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.