పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్టు కావడం ఏపీలో దుమారం రేపుతోంది. హైదరాబాద్ కొండాపూర్ లోని నారాయణ ఇంటికెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి తిరుపతి తరలించారు. విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా నారాయణను అదుపులోకి తీసుకున్నామన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్రెడ్డి.
తమ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచుకునేందుకే ఇలా చేశారన్న ఎస్పీ.. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు వెల్లడించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచే తెలుగు పేపర్ లీకేజీ అయినట్టు గుర్తించిన పోలీసులు .. ఆ మేరకు కేసు నమోదు చేశారు.
నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ గిరిధర్ వాట్సప్ నుంచి బయటకు వెళ్లినట్టు తేల్చారు. చిత్తూరు టాకీస్ అనే గ్రూప్ లో ప్రశ్నాపత్రం పోస్టు చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే గిరిధర్ తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.