గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా కాటుకు బలి అవుతున్నారు. అయితే కరోనా వైరస్ కట్టడి చేయడానికి ఫ్రంట్ లైన్ వారియర్స్గా వైద్యులు,పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వారి జీవితాలు బలి అవుతున్నా లేక్క చేయకుండా ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ విశేష సేవలందిస్తున్న పారిశద్ధ్య కార్మికులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అండగా నిలుస్తుంది.
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యమిస్తోంది. స్వీపింగ్ విధులు నిర్వహించే కార్మికులు, ఎంటమాలజీ వర్కర్లలో ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వస్తే వారిని ఐసొలేషన్కు అనుమతిస్తూ మందులను కూడా ఉచితంగా అందిస్తోంది. దానితో పాటు పూర్తి వేతనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం తొలివిడత కరోనా నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ గాని ఇతర పరీక్షల్లో పాజిటివ్ వచ్చి, ఆ పాజిటివ్ మెసేజ్ మొబైల్లో వచ్చిన కార్మికులందరికీ పూర్తిస్థాయి వేతనాలను కూడా అందజేస్తోంది.
అంతే కాదు కోవిడ్ బాధితులు ఐసోలేషన్ లో ఉన్న సమయంలో తమ సెల్ఫోన్ద్వారా వచ్చిన సమాచారాన్ని సంబంధిత సర్కిల్లోని అధికారులకు చూపిస్తే వారికి ఆయా ఐసొలేషన్ రోజుల వేతనాలను కూడా ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి అధికారిక పోర్టల్లో ఉంచిన వివరాలను సమర్పించాలని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.