కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్లు, సంసారంపై విరక్తితో చాలా మంది సన్యాసం వైపు మల్లుతున్నారు. ఎక్కువగా పెళ్లైన పురుషులు – యువ ఇంజనీర్లు సంసార – భవబంధాలను త్యాగం చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. నాగసాధువులుగా మారిపోతున్నారు. అడవులకు వెళుతూ ఆకులు అలములు తింటూ ధాన్యం చేస్తూ కాలం గడుపుతున్నారు. తాజాగా 10,000 మంది ఒకే సారి నాగసాధువులుగా మారిపోయారు.
యూపీలో మౌని అమావాస్య నాడు నిర్వహించిన కుంభమేళాలో దాదాపు 10000 మంది యువకులు – యువతులు సాధువులుగా మారేందుకు సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది.వారందరికీ తలనీలాలు తీసి కేవలం పిలక ఉంచి దీక్షలు ఇచ్చారు. ఎవరైనా నాగా సాధువుగా మారాలంటే ఈ తంతు తప్పనిసరి. తిరుక్షవరం తర్వాత గోచిపెట్టుకుని తమకు తామే పిండప్రదానం చేసుకోవాలి. బతికున్న ఇతర కుటుంబ సభ్యులకూ పిండం సమర్పించాలి. దాంతో పాత అస్తిత్వం పూర్తిగా అంతరించిపోతుంది. కొత్తపేరుతో నాగా సాధువుగా జీవితం ప్రారంభించాల్సి ఉంటుంది.
సాధువులుగా మారే వాళ్లలో హిందువులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే.. ఇందులో ముస్లిం – క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన యువత కూడా ఉండడం గమనార్హం. ఉక్రెయిన్ – మలేషియా నుంచి వచ్చి మరీ ఇలా సాధువులుగా మారిపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
దీక్ష తీసుకోగానే సంపూర్ణంగా నాగా సాధువుగా మారినట్టు కాదు. తర్వాత కఠినమైన పరీక్షలుంటాయి. వాటన్నిటిని దాటిన తర్వాతనే పూర్తిగా నాగా సాధువుగా మారినట్టు భావించాలి. అంతిమ దీక్ష వేరే ఉంటుంది. నిరంజనీ, మహానిర్వాణి వంటి వేరువేరు పేర్లు గల సుమారు 13 అఖారాలు ఉన్నాయి.
ఏదో క్షణికావేశంలో చేరారా? లేక జీవితంలో సంక్షోభం వచ్చి చేరారా? అనేది పరీక్షిస్తారు. నిజంగా వైరాగ్యం కలిగిందా? అనేది కఠిన పరీక్షల ద్వారా నిగ్గు తేల్చుకుంటారు. అన్నిరకాలుగా సంతృప్తి కలిగిన తర్వాతనే నాగా సాధువుగా స్వీకరిస్తారు.
సాధువు స్వీకరించాక వారు హిమాలయాలు – గుడులు – గోపురాల వెంటే ఉంటూ జీవితాంతం భగవంతుడి ధ్యాసలో బతకాల్సి ఉంటుంది. ఇలా ఇంత మంది చదువుకున్న వారు ఉద్యోగులు – సాధువులుగా మారిపోతున్న వైనం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.