సార్వత్రిక ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజం ఖాన్, తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో అజంఖాన్ మాట్లాడుతూ.. గతంలో జయప్రదను తానే రామ్పూర్ తీసుకొచ్చానని, ఆమె శరీరాన్ని ఎవరూ తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆమెను తానెలా కాపాడానో ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు.
అంతటితో ఊరుకోకుండా ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్ ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు అవమానకరమైనవని, ఆయనకు నోటీసులు పంపించనున్నామని, ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరనున్నామని ఆమె అన్నారు.