పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో పాక్ ప్రధానిపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసి నిప్పులు చెరిగారు. ఇమ్రాన్ఖాన్ అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ కెమెరా ముందు కూర్చుని భారత్కు శాంతి సందేశాలు ఇవ్వక్కర్లేదని అన్నారు. భారత్ పై దాడి జరగడం ఇదేమి మొదటి సారి కాదని పఠాన్ కోట్, ఉరి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. పాకిస్థాన్ ప్రధాని అమాయకత్వం ముసుగు వీడాలని భారత్ తరఫున నేను కోరుతున్నా’ అని ఒవైసీ అన్నారు.
పుల్వామా దాడి ఘటన వెనుక పాక్ ప్రభుత్వం, ఆర్మీ, ఇంటెలిజెన్స్, ఐఎస్ఐలు కలిసి చేశాయన్నారు. ఘటనకు కుట్ర పాక్లోనే జరిగిందని ఒవైసీ తెలిపారు. 40 మంది వీర జవాన్లను పొట్టన బెట్టుకున్న మీది జైషే మహ్మద్ సంస్థ కాదు.. జైషే సైతాన్. మహ్మద్ ఉగ్రవాది ఒక వ్యక్తిని చంపలేదు. మానవత్వంపై దాడి చేశాడు. మజ్సోద్ అజార్ మౌలానా కాదు.. దెయ్యం. అది లక్షరే తోయిబా కాదు.. లక్షరే సైతాన్’ అని ఓవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్లో ఉన్న ముస్లింల గురించి పాక్ చింతించాల్సిన అవసరం లేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఇండియా విధానమని, భారతదేశ పౌరులంతా కలిసిమెలిసి ఉండటం చూసి పాక్ కుళ్లుకుంటోందని విమర్శించారు.
‘పాకిస్థాన్కు చెందిన మంత్రి ఒకరు ఇటీవల ఇండియాలోని ఆలయాల్లో గంటలు మోగకుండా చేస్తామని హెచ్చరించారు. పాక్కు నేను ఒకటే చెబుతున్నా…ముస్లింలు బ్రతికున్నంత కాలం మసీదుల్లో అజాన్ వినిపిస్తుంది. గుడిగంటలు మోగుతూనే ఉంటాయి’ అని తీవ్రస్వరంతో అన్నారు. భారతదేశ ప్రజలంతా ఒకటిగా జీవిస్తారని, దేశం కోసం ఒకటిగా ముందుకు నడుస్తారని ఒవైసీ పేర్కొన్నారు.